జై భారత్ వాయిస్ న్యూస్ నర్సంపేట నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలోని మాధన్నపేట చెరువులో చేప పిల్లలను ఆదివారం వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద తో కలిసి శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డివిడుదల చేశారు. మొత్తం 6 లక్షల 81 వేల చేప పిల్లలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని పెద్ద చెరువైన మాధన్నపేట మత్స్య సహకార సంఘంలోని ప్రతీ సభ్యుడు చేపల పెంపకం లో నైపుణ్యం పెంపొందించుకొని ప్రైవేట్ వ్యక్తులకు చేపల ఉత్పత్తిని అప్పగించకుండా వారే నిర్వహించాలని కోరారు. మొత్తం 11 లక్షల 50 వేల విలువైన చేప పిల్లలు విడుదల చేసినట్లు తెలిపారు.
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ఆర్థికాభివృద్ధిలో మత్స్యోత్పత్తి చాలా కీలక పాత్ర పోషిస్తుందని, ఈరోజు చేప పిల్లలను చెరువులో వదిలించడం ద్వారా స్థానిక మత్స్యకారుల ఆదాయం పెరగడమే కాకుండా, ప్రజలకు పోషకాహార భద్రతను కూడా మెరుగుపరచడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రభుత్వం చేపల పెంపకానికి అవసరమైన అన్ని రకాల సహాయాలు, ప్రోత్సాహకాలు అందిస్తోందని తెలిపారు.రైతులు, యువకులు, మహిళా సంఘాలు ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని, ఆదాయాన్ని పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ రాంరెడ్డి , మత్స్యశాఖ జిల్లా అధికారి శ్రీపతి ,మార్కెట్ చైర్మెన్ పాలాయి శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


