(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్)
చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో పరమ పావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళీ దేవస్థానంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని వసంత నవరాత్రులు గురువారం నాడు ప్రారంభమయ్యాయి. ఉదయం నాలుగు గంటలకు నిత్యాహ్నికం నిర్వహించిన పిమ్మట అమ్మవారికి పూర్ణాభిషేకం నిర్వహించి అత్యంత సుందరంగా అలంకరణ జరిపారు. అనంతరం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కి ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు చైర్మన్ , ధర్మకర్తలు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి పసుపు రంగు చామంతికా పుష్పాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ డాక్టర్ బి శివసుబ్రహ్మణ్యం ధర్మకర్తలు, ఓరుగంటి పూర్ణచందర్,మయూరి రామేశ్వరరావు,బింగి సతీష్, పాలడుగుల ఆంజనేయులు, శ్రీధర్ రావు తదితరులు పాల్గొన్నారు. సాయంకాలం ఏడు గంటలకు దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి శ్రీ అయినవోలు రాధాకృష్ణ శర్మ చే పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.


