Jaibharathvoice.com | Telugu News App In Telangana
కృష్ణా

పార్లమెంట్‌లో ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2026 ఆమోదంపై సీఎం చంద్రబాబు హర్షం

జై భారత్ వాయిస్ న్యూస్ అమరావతి, రాజధానిగా అమరావతికి చట్టబద్దత లభించడం..రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పార్లమెంటులోని ఉభయ సభల్లో ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2026’ ఏకగ్రీవంగా ఆమోదం పొందటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు, వారి సంకల్పానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని, ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలు నేడు దేశ రాజధానిలో ప్రతిధ్వనించాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సీఎం ధన్యవాదాలు తెలియజేశారు. అమరావతి ప్రస్తానంలో ప్రధాని మోదీ ప్రతీ కీలక సందర్భంలోనూ అండగా నిలిచారని గుర్తు చేశారు. 2015 అక్టోబర్ 22 తేదీన అమరావతికి శంకుస్థాపన చేయటంతో పాటు, 2025 మే 2న అమరావతి పునర్నిర్మాణ పనులను కూడా ప్రధాని చేతుల మీదుగానే ప్రారంభించుకోవడం గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. అమరావతికి వెన్నుదన్నుగా నిలిచిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ప్రభుత్వానికి, రాజధాని బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పార్టీలకు, పార్లమెంటు సభ్యులకు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని లేక అనేక సవాళ్లను, అనిశ్చితిని ఎదుర్కొందని… అలాంటి క్లిష్ట సమయంలో అమరావతి రైతులు చేసిన అమూల్యమైన త్యాగం, వారి పట్టుదల, నమ్మకం రాజధాని కలను సజీవంగా ఉంచాయని కొనియాడారు. ఈ చారిత్రక విజయాన్ని అమరావతి రైతులకు అంకితం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. అమరావతిని ఏకైక ప్రజా రాజధానిగా పేర్కొంటూ పార్లమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలో ఒక కొత్త శకానికి నాంది పలికిందన్నారు. రాజధానిగా అమరావతి హోదా ఇక సుస్థిరం. దీనిపై ఇక ఎటువంటి అనుమానాలకు, చర్చలకు తావులేదన్నారు. ఆంధ్రప్రదేశ్ కు గుండె, ఆత్మ అయిన అమరావతి ఇక అన్‌స్టాపబుల్ అని సీఎం పేర్కొన్నారు. దేశానికే అమరావతి ఒక అద్వితీయమైన భవిష్యత్ నగరంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అమరావతి ద్వారా లభించే ఈ స్థిరత్వం ప్రతీ ఆంధ్రుడిలో కొత్త విశ్వాసాన్ని నింపాలని ఆయన ఆకాంక్షించారు.

Related posts

డూలాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వితంతువులకు, అనాధలకు, పేదలకు నూతన వస్త్రాలను పంపిణీ

నూరు శాతం ఓటీపీ ద్వారానే ఇంటి వద్దనే గ్యాస్ సిలిండర్లు డెలివరీ

అదివాసులకు అండగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం సిఎం చంద్రబాబు.