జై భారత్ వాయిస్ న్యూస్ అమరావతి : సింహాచలం ఎంపీజే గురుకుల పాఠశాలలో పది మంది విద్యార్థులకు ఎలుకల కరిచిన ఘటనపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే విద్యార్థులకు వైద్య సేవలందించాలని ఆదేశించారు. విద్యార్థులను కన్న బిడ్డల్లా సాకాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. సింహాచలం ఎంపీజే గురుకుల పాఠశాలలో పది మంది విద్యార్థులకు ఎలుకల కరిచిన ఘటన గురించి ఆ స్కూళ్ల కార్యదర్శి మాధవీలతతో మాట్లాడారు. విద్యార్థులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. గాయం తగ్గేవరకూ వైద్య సేవలు అందిస్తూ ఉండాలని స్పష్టంచేశారు. విద్యార్థులు ఉంటున్న గదిలోకి ఎలుకలు ఎలా ప్రవేశించాయని ప్రశ్నించారు. విద్యార్థుల గదుల్లోకి దోమలు, ఎలుకలు, ఇతర ప్రాణాంతక జీవాలు, విషపూరిత కీటకాలు రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంజేపీ స్కూల్ కార్యదర్శి మాధవీలత మాట్లాడుతూ, హాస్టల్ లో మరమ్మతులు చేయడం వల్ల కిటికీ మెస్ లు తొలగించారని, దానివల్లే ఎలుకలు గదిలోకి ప్రవేశించాయని వివరణ ఇచ్చారు. విద్యార్థులను వేరే గదికి తరలించామన్నారు. ఎలుకలను పట్టుకోడానికి బోనెలు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు ఎప్పటికప్పుడు వైద్యసేవలందిస్తున్నామని వివరించారు. మంత్రి సవిత మాట్లాడుతూ, ప్రస్తుతం గురుకులంలో ఉన్న ఎలుకలను పారదోలాలన్నారు. నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందికి మెమోలు ఇవ్వాలని ఆదేశించారు. తల్లిదండ్రులు ప్రభుత్వంపై నమ్మకంతో తమ బిడ్డలను హాస్టళ్లు, గురుకులాల్లో చేర్పిస్తున్నారన్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. హాస్టళ్లలో విద్యానభ్యసించే విద్యార్థులను కన్నబిడ్డల మాదిరి చూసుకోవాలన్నారు. బీసీ బిడ్డలపై నిర్లక్ష్యం చూపితే సహించేది లేదన్నారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బీసీ విద్యార్థులకు ఆహార, ఆరోగ్య భద్రతతో కూడిన విద్య కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తోందన్నారు. దోమలు సైతం తరగతి గదులు, విశ్రాంతి గదుల్లోకి రాకుండా ఉండేలా ద్వారాలకు, కిటికీలకు మెస్ లు ఏర్పాటు చేస్తున్నారు. పరిశుద్ధమైన తాగునీటిని అందించడానికి ఆర్వో ప్లాంట్లు, రక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బీసీ బిడ్డల కోసం రూ.కోట్లు వెచ్చించి రక్షణ చర్యలు చేపడుతుంటే, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పొరపాట్లు దొర్లడం క్షమించరాని నేరమన్నారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతమైతే, విధుల నుంచి తొలగించడానికి వెనుకాడబోమని మంత్రి సవిత ఆ ప్రకటనలో హెచ్చించారు.

