Elderly should be given due respect and importance హనుమకొండ : జై భారత్ వాయిస్
వృద్ధులకు తగిన గౌరవం, ప్రాముఖ్యతను ఇవ్వాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా అన్నారు.హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో సీనియర్ సిటీజన్స్ కమిటీ సమావేశం బుధవారం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా మాట్లాడుతూ వృద్ధులను గౌరవించడం మనందరి బాధ్యత అని అన్నారు. వృద్ధులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలలో విద్యార్థులకు వృద్ధుల గౌరవం, ప్రాముఖ్యత తెలిపేలా సంస్కార్ వికాస్ యోజన కార్యక్రమం ద్వారా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. వృద్ధుల కోసం పనిచేసే ప్రతి కార్యాలయాన్ని ప్రతి నెల తనిఖీ చేయాలన్నారు. ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు కేటాయించిన సీట్లలో వారిని కూర్చునే విధంగా ఆయా బస్సు డ్రైవర్లు, కండక్టర్లు బాధ్యత తీసుకునేలా డిపో మేనేజర్లు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లో ప్రతి ఎంట్రీని తప్పనిసరిగా నమోదు చేయాలని, వారి స్థితిగతులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా వృద్ధుల సంక్షేమం, తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్లు మాట్లాడుతూ గతంలో నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని పునరావృతం చేయాలని, ప్రభుత్వం వృద్ధుల కోసం ఆవాసాలను త్వరగా ఏర్పాటు చేయాలన్నారు. తల్లిదండ్రుల పోషణ, సంరక్షణ చట్టం 2007పై అవగాహన సదస్సులను జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో నిర్వహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో రమేష్, మెప్మా పీడీ బద్రు నాయక్, జిల్లా సంక్షేమ అధికారి మధురిమ, జిల్లా ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఉమాశ్రీ, జిల్లా హాస్పిటల్ సర్వీస్ అధికారి గౌతమ్ చౌహన్, లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్, డిప్యూటీ ఆర్ ఎం మాధవ రెడ్డి, డిఎవో విజయలక్ష్మి, రిటైర్డ్ డిఎస్పి, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దామెర నర్సయ్య, ప్రధాన కార్యదర్శి యుగంధర్, అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్ పర్సన్ అనితా రెడ్డి, వివిధ శాఖల అధికారులతో పాటు సీనియర్ సిటిజన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
