కుందుర్పి జై భారత వాయిస్
బదిలీపై వెళ్తున్న పదవీ విరమణ చేసిన అధికారుల సేవలు ప్రశంసనీయమని అనంతపురం జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ అభిప్రాయపడ్డారు. జిల్లా నుండీ ఒక ఏ.ఆర్ అదనపు ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, నలుగురు ఆర్ ఎస్ ఐ లు బదిలీ కాగా, డీపిఓ సూపరింటెండెంటు, గుంతకల్లు ఒన్ టౌన్ ఏఎస్సై పదవీ విరమణ చేశారు. శుక్రవారం పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించి వీరందరికీ జిల్లా ఎస్పీ చేతుల మీదుగా సన్మానం చేశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. జిల్లా నుండీ ఇతర జిల్లాలకు వెళ్తున్న ఏ.ఆర్ అదనపు ఎస్పీ ఏ.హనుమంతు, గుంతకల్లు డీఎస్పీ యు.నరసింగప్ప, అనంతపురం డీఎస్పీ జి.ప్రసాద్ రెడ్డి, ఆర్ ఎస్ ఐలు చాలా బాగా పని చేశారన్నారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం, జిల్లాకు వచ్చిన ప్రముఖుల పర్యటన బందోబస్తు, ఇలా కీలక సమయాలలో విజయవంతంగా విధులు చేపట్టారని గుర్తు చేశారు. అదేవిధంగా పదవీ విరమణ పొందిన సూపరింటెండెంట్ శ్రీనివాసులు మంచి సేవలు అందించారన్నారు. మనం చేసే పని కావచ్చు లేదా విధులు కావచ్చు ప్రజల అభిప్రాయమే పోలీసులకు ప్రామాణికమన్నారు. ప్రజలకు సేవలు అందించడం వారితో మమేకమై చట్టబద్ధంగా ముందుకెళ్లడం ముఖ్యమన్నారు. బదిలీపై జిల్లా నుండీ ఇతర జిల్లాలకు వెళ్తున్న పోలీసు అధికారులకు మరియు పదవీ విరమణ చేసిన సిబ్బందిని పూలమాలలు వేసి శాలువాలతో ఎస్పీ సత్కరించారు. మెమొంటోలు అందజేశారు.

previous post
next post