సంఘ సంస్కరణ దార్శనికుడు ‘కందుకూరి’
– ఘనంగా వీరేశలింగం పంతులు జయంతి
కందుకూరి వీరేశలింగం పంతులు ఆధునిక యుగకర్త, స్ఫూర్తి ప్రదాత, మార్గ దర్శకుడు, దార్శనికుడు అని, తాను నమ్మిన సిద్దాంతం కోసం ఎంతటి కష్టానైనా ఎదుర్కొని ముందుకు నడిసిన మహనీయుడని తెలుగు విభాగ సీనియర్ ఆచార్యులు వెలమల సిమ్మన్న పేర్కొన్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయ తెలుగు విభాగం ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం పంతులు 176 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. తెలుగు శాఖాధిపతి ఆచార్య జర్రా అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా కందుకూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆచార్య వెలమల సిమ్మన్న విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కందుకూరి సమాజం ఎటువైపు నడిపిస్తే అటువైపు నడిచే వ్యక్తి కాదని, సమాజాన్ని తానే నడిపిన వ్యక్తి అని కొనియాడారు. సంఘ సంస్కరణ దృక్ఫధంతో తన జీవితాన్ని, ఆస్తిని ప్రజలపరం చేసిన మహోన్నత వ్యక్తిత్వం గల శక్తి సంపన్నుడన్నారు. సమాజ ఉద్ధరణకు పత్రిక రంగాన్ని మించిన ఆయుధం లేదని గ్రహించిన కందుకూరి వివేకవర్ధని పత్రికను స్థాపించి దాని ద్వారా స్త్రీ జనోద్దరణకు పాటుపడుతూ, మరొక వైపు సమాజంలో ఉన్న కుళ్ళు కుతంత్రాల పై కొరడా ఝులిపించారని తెలియజేశారు. ఆత్మీయ అతిథి డా వి.యస్.కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకులు డా. పి.గోపాలనాయుడు మాట్లాడుతూ కందుకూరి ఒక వైపు పత్రిక రంగాన్ని మరొకవైపు రచన రంగంతో సమాజ సంస్కరణ చేసిన అభ్యుదయ వాదన్నారు. సమాజాభివృద్ధి జరగాలంటే స్త్రీ విద్య ద్వారానే సాధ్యమవుతుందని గ్రహించి కందుకూరి వారికోసం పత్రికలు, పాఠశాలలు స్ధాపించి తన జీవితాన్ని త్యాగంచేసిన మహానీయుడన్నారు. బాలవితంతువులకు పునర్వివాహాలు, మూఢ విశ్వాసాలపై నిరసన ప్రదర్శించే సమయంలో స్వజాతి నుంచి ఎదురైన ఆటుపోటులను ఎదుర్కొని విజయం సాధించిన ధీశాలి కందుకూరి అన్నారు. ఆయన దాదాపు 150 రచనలు చేశారని, ముఖ్యంగా నాటక రంగం ద్యారా సమాజ సందేశాన్ని ఇచ్చిన స్పూర్తి ప్రధాత అని కొనియాడారు. సమాజంలో ఉన్న సాంఘిక రుగ్మతలపై తన గళాన్ని వినిపించటానికి కలాన్ని ఆయుధంగా చేసుకొని, అందులో సఫలీకృతులయ్యారని అందుకే ఆయన జన్మదినాన్ని తెలుగు నాటకరంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఆయన నాటకాలు సమాజ దిక్చూచియై నేటికి గొప్ప సందేశాన్ని ఇస్తూ సార్వకాలక సార్వజనీనమై వెలుగొందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డా. అన్నంశెట్టి ఈశ్వరమ్మ, డా బూసి వెంకటస్వామి, డా కట్టెపోగు రత్నశేఖర్, డా పెండ్యాల లావణ్య, డా ఆతుకూరి వెంకటేశ్వర్లు, పరిశోధక విద్యార్థులు, స్నాతకోత్తర విద్యార్థులు, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
