జై భారత్ వాయిస్ : వర్ధన్నపేట
రోడ్డు ప్రమాదంలో గాయపడిన బావమరిది బాగుకోసం మోకాళ్లపై నడిచి మల్లన్న స్వామికి మొక్కలు సమర్పించుకున్నాడు ఓ బావ. ఈ అరుదైన ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలులో జరిగింది.హన్మకొండ జిల్లా కమలాపురం మండలం అంబాల గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి వాళ్ల బావమరిది రజినీకాంత్ ఈనెల 17న రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదానికి గురైన తన బావమరిది కోలుకుంటే మోకాళ్లపై వచ్చి మొక్కలు సమర్పించుకుంటానని ఐనవోలు మల్లికార్జున స్వామి వారికి మొక్కుకున్నట్లు నాగరాజు తెలిపారు.. మొక్కుకున్నట్లుగానే మల్లికార్జున స్వామి వారి ఆశీర్వాదంతో తన బావమరిది ప్రాణాలతో బయటపడ్డాడని అందుకే స్వామివారి దర్శనానికి వచ్చానని వెల్లడించారు. ఐనవోలు నంది కూడలి నుండి గర్భాలయం వరకు మోకాళ్లపై నడిచి మొక్కులు చెల్లించుకున్న నాగరాజును ఆలయ కార్య నిర్వహణ అధికారి అద్దంకి నాగేశ్వరరావు, అర్చకులు ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు అందజేశారు. రోడ్డు ప్రమాదానికి గురైన బావమరిది బాగుండాలనే తపనతో చేసిన దైవకార్యం చూపరులను ఆకట్టుకుంది.

previous post
next post