ఒంగోలు::ఆషాడమాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీగిరిగిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత శోభాయమానంగా శ్రీగిరి గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరిగినది. స్థానిక శ్రీగిరి పాదపీఠం వద్దగల శ్రీ బాపూజీ గోసంరక్షణ సంఘం గోశాల వద్ద నుండి అత్యంత నయన మనోహరంగా అలంకరించిన తేరుపై స్వామివారి ప్రతిమను స్థిరపరచి గోవింద నామాలు చదువుతూ భక్తులు స్థానిక గ్రంథాలయం, కేశవస్వామి పేట, భగీరథ సెంటర్, శర్మ కాలేజ్ క్రికెట్ గ్రౌండ్, గద్దలగుంట మీదుగా శ్రీగిరి శ్రీనివాసుని దర్శించుకొనుటకు శ్రీగిరి చేరారు. శ్రీగిరి పురవీధులు స్వామివారి నామస్మరణతో మార్మోగాయి తొలిక గోసంగంలో గోపూజ నిర్వహించిన భక్తులు శంఖు, చక్ర, తిరునామం, హనుమ గరుత్మంత చిహ్నాలను పట్టుకొని గోమాత ముందు నడువగా కర్ణపేయంగా మంగళ వాయిద్యాలు మ్రోగుచుండగా గోవింద నామాలు చదువుతూ భక్తులు శ్రీగిరి గిరి ప్రదక్షిణ పూర్తి చేశారు. శ్రీగిరిపై కొలువైన శ్రీవారిని దర్శించి పరవశులయ్యారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం మాట్లాడుతూ గత సంవత్సరం శ్రావణమాసంలో ప్రారంభించిన అద్వితీయమైన ఆధ్యాత్మిక కార్యక్రమం శ్రీగిరి గిరి ప్రదక్షిణ ఈ ఆషాడమాసం తో భక్తుల పూర్తి సహకారంతో సంవత్సరం పూర్తి అయినదని ప్రతి ఒక్కరూ ఏ రోజు అయినా గిరి ప్రదక్షిణ చేసిన తరువాత స్వామివారిని దర్శించుకోవాలని తద్వారా ప్రతి ఒక్కరిలో సకారాత్మకమైన ఆలోచనలు ఏర్పడతాయని, ధార్మిక భావాలు మరింతగా ఉద్దీపన చెందుతాయని తెలిపారు.గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం, కోశాధికారి వలేటి కృష్ణారావు, సహకార్యదర్శి నేరెళ్ల శ్రీనివాసరావు, చలువాది బ్రహ్మయ్య, ధనిశెట్టి రామనాయుడు, నల్లమల్లి కోటి సూర్యనారాయణ, పౌర్ణమి తిధి గిరిప్రదక్షిణ నిర్వాహకులు బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మార్గ మధ్యలో భగీరధ మహర్షి మందిరము వద్ద సగరపుత్రులు గిరి ప్రదక్షిణ భక్తులకు పాలప్రసాదం పంపిణీచేశారు.
