*ఆత్మహత్యలను నివారించడాన్ని ప్రతీ ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని.. ఎంపీ డాక్టర్ కడియం కావ్య*
హన్మకొండ
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 10 హనుమకొండ ప్రతినిధి:-
ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్బంగా ఇండియన్ సైకీయాట్రిక్ సొసైటీ తెలంగాణ రాష్ట్రం వారి ఆధ్వర్యంలో వరల్డ్ సూసైడ్ ప్రీవెన్షన్ డే పోస్టర్ ను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ ఇతర దేశాలతో పోలిస్తే భారత దేశంలో ఎక్కువ మంది ఆత్మహత్యలకు పాల్పడు తున్నారని అన్నారు. ఆత్మహత్యలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి సెప్టెంబర్ 10న ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా జరుపు కుంటున్నామని తెలిపారు. ఆత్మహత్యల నివారణ, అవగాహన కోసం ప్రపంచ సైకీయాట్రిక్ సోసైటీ తెలంగాణ రాష్ట్ర బ్రాంచ్ వారు కృషి చేయడం అభినంద నీయమని అన్నారు.ఆత్మహత్య చేసుకునే వారిని ముందుగానే గుర్తించవచ్చని పదేపదే నిరాశగా మాట్లాడడం, క్షణికావేశానికి లోనవ్వడం, నేనెందుకు పనికిరానంటూ సంబోధించడం, అందరికీ దూరంగా ఉండడం లాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదని తెలిపారు. ఇలాంటి వారికి ధైర్యం చెప్పడం. సమస్యకు పరిష్కారం ఉందనే నమ్మకం వారిలో కల్పించేల చూడాలని అన్నారు. డ్రగ్స్ మరియు మద్యపానానికి బానిసలుగా మారిన వారికీ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయని, వారిని గుర్తించి సరైన కౌన్సిలింగ్ ఇప్పిస్తే ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడవచ్చని తెలిపారు. ఈ మధ్య చిన్న పిల్లలు కూడా తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నారని తల్లిదండ్రులు పిల్లలతో సమయాన్ని గడపాలని సూచించారు. వాళ్ల సమస్యలను పంచుకునే ప్రయత్నం చేయాలని చదువులో వెనుకబడ్డారనే ఒత్తిడికి లోను కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఏదైనా సమస్య కనిపిస్తే మానసిక వైద్యుల్ని సంప్రదించి. తగిన మందులు, కౌన్సెలింగ్ ఇప్పించాలని వివరించారు. ఆత్మహత్యలను నివారించడాన్ని అందరూ ఒక సామాజిక బాధ్యతగా భావించి. కృషి చేసినప్పుడే ఆచరణ ద్వారా ఆశయ సాధన సాధ్యపడుతుందని పేర్కొన్నారు.