ఏలూరు/ముసునూరు, సెప్టెంబరు, 10: జై భారత్ వాయిస్ ‘ ముసునూరు మండలం చెక్కపల్లి వెళ్లే రహదారి చింతలవల్లి వద్ద సంధ్యవాగు ఉధృతికి కొట్టుకు పోవడంతో తాత్కాలిక వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి గారు చెప్పారు. మంగళవారం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న గోగులంపాడు నుంచి చెక్కపల్లి వెళ్లే రహదారి వంతెనను రాష్ట్రమంత్రి కొలుసు పార్ధసారధి గారు పరిశీలించారు. ఈ సందర్బంగా ప్రస్తుతం తాత్కాలిక నిర్మాణం పనులు చేపట్టేందుకు పైపులుకూడా తీసుకురావడం జరిగిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు వచ్చిన వెంటనే శాశ్వత నిర్మాణ కార్యక్రమం చేయడం జరుగుతుందన్నారు. గ్రామంలో కొన్నిచోట్ల డైనేజి సమస్య కనబడిందని పెద్ద వర్షాలు కురవడంతో డ్రైనేజి వ్యవస్ధ సరిగ్గా లేని కారణంగా ఇబ్బందులు చోటుచేసుకున్నాయన్నారు. అవసరమైన చోట వెంటనే డ్రైన్లు, కల్వర్టులు నిర్మించడం జరుగుతుందన్నారు.. వర్షాలు మూలంగా చాలా చోట్ల రహదారులు దెబ్బతిన్నాయన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ ఎక్కువగా దెబ్బతిన్నాయో అక్కడ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని పంటలు మినుము, పత్తి, పూర్తిగా దెబ్బతిన్నాయని అక్కడక్కడా ఇళ్లు కూడా దెబ్బతిన్నాయన్నారు. తప్పకుండా నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు న్యాయబద్దంగా రైతు నష్టపోయిన ప్రతి సెంటు భూమి వివరాలతో సమగ్ర నివేదిక తయారు చేయాలన్నారు. దెబ్బతిన్న రహదారులకు తాత్కాలిక మరామ్మత్తులు చేపట్టి రవాణా సౌకర్యానికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
వీరి వెంట తహశీల్దారు రాజ్ కుమార్, ఆర్ అండ్ బి డిఇ బాబూరావు, ఎఇ అశోక్ బాబు, ఇఓఆర్డి ఎస్ శ్రీనివాసరావు, పలువురు మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్ధానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.