జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ)
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో హంటర్ రోడ్డు లోని మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని గురువారం నిర్వహించారు.వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్ ఉద్యోగుల కోసం మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని, ఆసుపత్రి యాజమాన్యం వైద్య సేవలను అందించేందుకు ముందుకు రావడం పట్ల అభినందనలు తెలిపారు. వైద్య శిబిరాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ వివిధ కారణాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ బాధితుల సంఖ్య పెరుగుతూ ఉందని అన్నారు. మధుమేహానికి సంబంధించి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభించే మందులను మధుమేహ బాధితులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.మెడికవర్ ఆసుపత్రి మెడికల్ విభాగం సూపరింటెండెంట్ నవీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉచిత వైద్య శిబిరాన్ని కలెక్టరేట్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి సంబంధించిన వైద్యులు వైద్య శిబిరానికి వచ్చిన ఉద్యోగులను పరీక్షించి మందులను అందజేశారు. జనరల్ మెడిసిన్, బిపి, షుగర్, కార్డియాలజీ, ఆర్థో, నెఫ్రాలజీ వైద్య సేవల ప్రత్యేక వైద్యుల ఆధ్వర్యంలో ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించి వైద్య సేవలను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.వి.గణేష్, ఆసుపత్రి వైద్యులు డాక్టర్ గిరీష్ లోయ, డాక్టర్ పూర్ణచంద్, డాక్టర్ శ్రవణ్ కుమార్, డాక్టర్ రత్న కార్తిక్, సిబ్బంది, పాల్గొన్నారు.

