(జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ)
కాకతీయుల కాలం నాటి ఓరుగల్లు లోని భద్రకాళి చెరువు పూడికతీత పనులను వేగవంతంగా చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య అధికారులను ఆదేశించారు. దేనికి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేయాలని అధికారులకు సూచించారు
బుధవారం భద్రకాళి చెరువులో చేపట్టిన పూడికతీత పనులను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే పరిశీలించారు.భద్రకాళి చెరువు పూడికతీత పనులకు సంబంధించిన వివరాలను సాగునీటిపారుదల శాఖ అధికారులను కలెక్టర్లు అడిగి తెలుసుకున్నారు.

పూడికతీత పనులకు సంబంధించి సాగునీటి పారుదల, రెవెన్యూ, కుడా, ఇతర శాఖల అధికారులతో కలెక్టర్లు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ భద్రకాళి చెరువు పూడికతీత పనులకు సంబంధించి సర్వే చేసి దేనికి ఎంత ఖర్చవుతుందనే వాస్తవ అంచనాలను తయారు చేయాలని సాగునీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. పూడిక తీసిన మట్టిని డంపింగ్ చేసేందుకు స్థలాలను గుర్తించాలని ఆర్డీవోలను ఆదేశించారు. చెరువు మట్టి కావాలని దరఖాస్తు చేసుకున్న ప్రజలతో అధికారులు సమావేశం నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా కుడా అధికారులు మూడు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తీసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించగా కలెక్టర్ ఆమోదం తెలిపారు.ఈ కార్యక్రమంలో హనుమకొండ వరంగల్ ఆర్డీఓలు రాథోడ్ రమేష్, సత్యపాల్ రెడ్డి, సాగునీటి పారుదల శాఖ సీఈ అశోక్ కుమార్, ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈఈ సీతారాం, కుడా పీవో అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.