కాంగ్రెస్ హైకమాండ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది..
విజయశాంతి, అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్ లను కాంగ్రెస్ పెద్దల సభకు పంపనుంది. ఇందులో శంకర్ నాయక్, అద్దంకి దయాకర్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారే. కేతావత్ శంకర్ నాయక్ రాష్ట్రవ్యాప్తంగా అంతగా తెలిసిన నాయకుడు కాకున్నా.. మిర్యాలగూడ, హుజుర్ నగర్, నాగార్జునసాగర్, సూర్యాపేట ప్రాంతాల్లో బాగా తెలిసిన గిరిజన నాయకుడు. ఎన్నోఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ వచ్చాడు. శంకర్ నాయక్ ప్రస్తుతం ఆయన నల్గొండ జిల్లా డిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నాగార్జున సాగర్ లో జానా రెడ్డికి బ్యాక్ బోన్ లాగా ఆయన పని చేశారు. అంతేకాదు.. ఆయన ఇద్దరు కుమారులు ఒకరు ఎంపీ, ఎమ్మెల్యేగా గెలవడంలో కూడా శంకర్ నాయక్ కీలక పాత్ర పోషించారు. ఎస్టీ కమ్యూనిటీకి చెందిన శంకర్ నాయక్ మిర్యాలగూడ చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని తండాల్లో గిరిజన బ్యాంక్ ఉంది. మిర్యాలగూడలో బీఎల్ఆర్ ఎమ్మెల్యేగా గెలిపించడంలోనూ శంకర్ నాయక్ కీలకంగానే పని చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ ఎమ్మెల్యే సీటు ఆశించి శంకర్ నాయక్ నిరాశ చెందారు. కాంగ్రెస్ అధిష్టానం అది గుర్తించి ఇప్పుడు ఎమ్మెల్సీ గా అవకాశం ఇచ్చింది. నల్గొండ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి శంకర్ నాయక్ పేరును హైకమాండ్ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.
