Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

రాచకొండపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి

50 వేల ఎకరాల భూమి సేకరించి, ఈస్ట్ సిటీ నిర్మాణం
ఇప్పటికే విదేశీ కంపెనీలతో చర్చలు, త్వరలో కార్యాచరణ
రాజకీయ గురువు చంద్రబాబు అమరావతి భూసేకరణే స్ఫూర్తిగా అడుగులు
రైతులకు మార్కెట్ ధరకంటే రెట్టింపు ధర.. కాదంటే డెవలప్ మెంట్ అగ్రిమెంట్లు

హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న రాచకొండ భూములపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పడింది. రోజురోజుకూ పెరుగుతున్న ప్రజావసరాల దృష్ట్యా రాచకొండలో 50 వేల ఎకరాల భూములను రైతుల నుంచి సేకరించి, అభివృద్ధి పరిచి, మరొక ఈస్ట్ సిటీని నిర్మించేందుకు సీఎం రేవంత్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. భవిష్యత్తులో ఎలాంటి కోర్టు కేసులు, ఇబ్బందులు రాకుండా మార్కెట్ ధరకంటే రెట్టింపు ధరను రైతులకు చెల్లించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.
లేదంటే ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి తరహాలో రైతుల భూములను లక్షలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసి, ప్లాట్లుగా విభజించి, రోడ్లు పోగా ఎకరాకు 1500 గజాలకు పైగా రైతులకే ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం విదేశీ కంపెనీల సహకారం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో ఏపీ రాజధాని అమరావతి తరహాలో భూసేకరణ జరుపుతామని హైదరాబాద్ శివార్లలోని రాచకొండ వద్ద మరో నగరాన్ని నిర్మిస్తామని ఎన్నికలకు ముందు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే రేవంత్ రెడ్డి ప్రకటించారు. జాతీయ న్యూస్ ఛానల్ ఇండియా టుడే నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రేవంత్ తన ప్లాన్ ను బయటపెట్టారు.
తెలంగాణ రాజధాని ప్రాంతంలో హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత నాలుగో నగరాన్ని ఏర్పాటు చేసేందుకు 50,000 ఎకరాల భూమిని ప్రజల నుంచి సులువుగా సేకరించవచ్చని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తన గురువైన చంద్రబాబు నాయుడు పెట్ ప్రాజెక్ట్ అమరావతిని స్ఫూర్తిగా తీసుకుంటున్నానని రేవంత్ స్పష్టం చేశారు. కొత్తగా నిర్మించబోయే ఈస్ట్ సిటీ ప్రపంచ నగరాలతో పోటీ పడుతుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌కు అతి సమీపంలో యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో విస్తరించి ఉన్న రాచకొండ ప్రాంతానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. వందలాది గ్రామాల ప్రజలు ఇక్కడి భూముల్లో ఏండ్లుగా జీవిస్తున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని రాచకొండ, తిప్పాయిగూడ, అల్లాపుం, కడీలబావితండా, రాచకొండ తండా, ముచ్చర్లకుంటతండా, పటేల్‌చెర్వుతండా తదితర గ్రామాల ప్రజలు ఇక్కడి భూములపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో అత్యధికులు గిరిజనులే. పాత నల్లగొండ జిల్లాలోని నారాయణపురం ప్రాంతంతో పాటు రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల మండలాల్లోని రాచకొండ పరిసర ప్రాంతాల గుట్టల ప్రాంతంలో ఉమ్మడి నల్లగొండతోపాటు రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సుమారు 32 వేల ఎకరాల్లో రాచకొండ విస్తరించి ఉంది. ఉమ్మడి నల్లగొండలో 14,765 ఎకరాల్లో ఉండగా, ఎక్కువ భాగం రాచకొండ గ్రామ రెవెన్యూ పరిధిలోనే ఉంది. వీటిలో 2,217 ఎకరాల పట్టా భూములు, 2,956 ఎకరాల ప్రభుత్వ భూమి, 8,945 ఎకరాల అటవీభూమి ఉంది. మిగతాది రంగారెడ్డిలో విస్తరించి ఉంది.

ఈస్ట్ సిటీతో రాచకొండకు మహర్దశ…

రాచకొండ పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్నది. ఇటీవల పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది. హైదరాబాద్‌కు దగ్గరగా ఉండడంతో టూరిజం కారిడార్‌గా మారుతున్నది. రాచకొండ కోటను సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నది.ఇక్కడ సుమారు వందకుపైగా ఆలయాలున్నాయి. నారాయణపురం మండల పరిధిలోని సరళ మైసమ్మ ఆలయానికి నిత్యం భక్తులు పోటెత్తుతుంటారు. సినిమా షూటింగ్‌లు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. సీఎం రేవంత్‌ రెడ్డి ఈస్ట్ సిటీ నిర్మాణం ప్లాన్ అమలైతే రాచకొండ అతిపెద్ద పర్యాటకం ప్రాంతంగా మారి రాచకొండ ప్రాంతం రూపురేఖలే మారిపోనున్నాయి.

ఈస్ట్ సిటీ నిర్మాణంపై కొంతమంది ప్రముఖులకు పక్కా సమాచారం ఉన్నట్లు తెలిసింది. దీంతో వారు తమ మనుషులతో రాచకొండ పరిధిలోని నారాయణపురం, చౌటుప్పల్‌, గట్టుప్పల్‌, మర్రిగూడ, మాల్‌, మంచాల తదితర మండలాల్లో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేస్తున్నట్లుగా తెలుస్తున్నది.

Related posts

సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకొని ఉపాధ్యాయులకు మంత్రి సురేఖ శుభాకాంక్షలు

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కు  శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొండా సురేఖ

మహిళలకు గుడ్ న్యూస్ మ‌హిళా సంఘాల‌కు ఆర్టీసీ అద్దె బ‌స్సులు